పెదనందిపాడు - పన్నుల చెల్లింపు నిరాకరణ

పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం యావద్భారత దేశ దృష్టినే కాకుండా, బ్రిటీష్ పార్లమెంట్ లోని సభ్యుల దృష్టిని సైతం ఆకర్షించింది. గుంటూరు జిల్లాలోని పెదనందిపాడులో గ్రామాధికారులు తమకు జీతం తక్కువ, పనిభారం ఎక్కువని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం పట్టించుకోలేదు. దాంతో గ్రామాధికారులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. వీరి రాజీనామాలతో పన్నుల వసూలు ఆగిపోయింది.

గ్రామాధికారులు రైతులతో చేతులు కలుపడం, ప్రత్యామ్నాయ నియామకాలకు ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ మంటగలిసింది. ఇక్కడ జరిగిన పన్నుల నిరాకరణోద్యమానికి పర్వతనేని వీరయ్య చౌదరి నాయకత్వం వహించారు. ఉద్యమంలో భాగంగా ప్రభుత్వాధికారులను ప్రజలు వెలివేశారు. కలెక్టర్ గ్రామాధికారుల వంశ పారంపర్య హక్కులు రద్దు చేస్తామని బెదిరించినా వారు పట్టించుకోలేదు. పరిస్థితిని గమనించేందుకు ప్రభుత్వ రెవెన్యూ సభ్యుడైన హేరేసను పంపినా ఫలితం లేదు. ఈ గ్రామాధికారులుగా కొత్త వారిని తీసుకునే ప్రభుత్వాన్ని శాంతి సేన అనే వాలంటీర్ దళం భగ్నం చేసింది. ఇంతలో మహాత్మాగాంధీ సహాయ నిరాకరణోద్యమాన్ని ఆపి వేయాల్సిందిగా దేశవ్యాప్తంగా పిలుపునిచ్చాడు. దాంతో ఈ ఉద్యమం ఆగిపోయింది. 

రంప ఉద్యమం-అల్లూరి సీతారామరాజు

ఆంధ్రదేశ స్వాతంత్రోద్యమ చరిత్రలో అల్లూరి సీతారామ రాజు సాగించిన విప్లవోద్యమం ఒక ముఖ్య ఘట్టం. ఇది రంప ఉద్యమంగా ప్రసిద్ధి చెందింది. దీనికి, కాంగ్రెస్ ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదు. గోదావరి ఏజెన్సీ ప్రాంతంలో 1922 జనవరి నుంచి 1924 మే వరకు ఈ ఉద్యమం కొనసాగి, ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. దీనికి నాయకుడు అల్లూరి సీతారామరాజు 1921 నాటికి ఆయన సహాయ నిరాకరణోద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు. హింసా పద్దతిని నమ్మాడు. బ్రిటీష్ వారిని భారతదేశం నుంచి వెళ్లగొట్టాలని నిశ్చయించుకుని 1921 జులైలో చిట్టగాంగ్ కు వెళ్లి బెంగాల్ విప్లవాదులతో మంతనాలు జరిపాడు. అక్కడినుంచి తిరిగి వచ్చి తూర్పు గోదావరి జిల్లాలోని గూడెం కొండలను తన కార్యకలాపాలకు స్థావరంగా ఎన్నుకున్నాడు. దీనికి కారణం ఇక్కడి గిరిజనులపై స్థానిక తహసీల్దార్ బాస్టియన్ అక్రమ చర్యలు, ముత్తదారీ పద్ధతులు ప్రజలు పోడు వ్యవసాయం వల్ల ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని అసంతృప్తితో ఉన్నారు. వీటికి సీతారామరాజు నాయకత్వం వహించి బ్రిటిష్ వ్యతిరేక పోరాటం చేశాడు. ఉద్యమాన్ని నడపడానికి ఆయుధ సామాగ్రి అవసరమయింది. అందువల్ల ఆయుధాల కోసం పోలీస్ స్టేషన్లపై దాడులు చేశారు. 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్ పై దాడిని నిర్వహించారు. సీతారామరాజుకు గాం సోదరులుగా పేరున్న గాంమల్లు దొర, గాం గంటం దొర నమ్మిన బంట్లుగా ఉన్నారు.

కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి పోలీసు స్టేషన్లపై దాడిచేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పరిస్థితిని గమనించిన ప్రభుత్వం స్కాట్ వార్డ్, హేటర్లను బళ్లారి పోలీసు బలగాలను పంపించింది. ఈ విషయం వేగుల ద్వారా తెలుసుకున్న రాజు వారిని దామనపల్లిఘాట్ దగ్గర దట్టమైన అడవిలో కాపుకాసి మెరుపుదాడి చేసి స్కాట్ వార్డ్, హేటర్, ఇంకా నలుగురు పోలీసులను హతమార్చాడు. మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాడు. ప్రభుత్వం వ్యూహాన్ని మార్చి మలబారు నుంచి ప్రత్యేక పోలీసులను పిలిపించింది. 1922 డిసెంబరు 6న పెద్దగడ్డపాలెం వద్ద పోలీసులు రాజుపై ఆకస్మిక దాడిచేసినా, ఆయన తప్పించుకున్నాడు. తర్వాత కొంతకాలంపాటు రాజు కార్యకలాపాలు సాగించలేదు. దాంతో ప్రభుత్వం మలబారు. పోలీసులను వెనక్కు పిలిచింది.

అయితే 1923 ఏప్రిల్ 18న రాజు అన్నవరం పోలీసు స్టేషన్ పై దాడిచేసి తన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాడు. అక్కడ ఆయుధాలు దొరకలేదు. అయితే స్థానిక సబ్ ఇన్ స్పెక్టర్, పోస్టు మాస్టర్, డిప్యూటీ తహసిల్దార్ విజయోత్సాహంతో రాజుకు స్వాగతం పలికారు. అక్కడ నుంచి రాజు శంఖపరం వెళ్లాడు. అక్కడ ఆయనకు ప్రజల నుంచి ఘనస్వాగతం లభించింది. రాజు అనుచరులు మే 10 నుంచి 31 వరకు అనేక గ్రామాలు తిరిగి అనేక వస్తు సంబరాలను సంపాదించారు. జూన్ 15న రాజు కొండకండేరు, మల్కనగిరిలపై ఆయుధాల కోసం దాడిచేశాడు. కానీ, ఏమీ లభించలేదు.

సెప్టెంబర్ 18న గాం మల్లుదొర పోలీసులకు దొరికాడు. ప్రభుత్వం పోలీసు స్టేషన్లో ఆయుధాలు ఉంచకుండా జాగ్రత్తలు తీసుకుంది. ప్రభుత్వం రెండు అస్సాం రైఫిల్స్ దళాలను రప్పించింది. రూథర్ ఫర్డ్ ను ప్రత్యేక కమిషనర్ గా నియమించి, రాజును పట్టుకునే బాధ్యతను ఆయనకు అప్పగించింది. 1924 మే 6న రాజు సన్నిహితుడు, సహచరుడు అగ్గిరాజుగా ప్రసిద్ధిచెందిన పేరిచర్ల సూర్యనారాయణ మద్దేరు వద్ద ప్రభుత్వానికి పట్టుబడ్డాడు. 1924 మే 7న జమేదారు కంచుమీనన్ రాజును బంధించాడు. సీతా రామరాజును కొయ్యూరుకు తీసుకువచ్చి కాల్చి చంపారు. ఆ తర్వాత పోలీసులు రాజు అనుచరులను క్రమంగా పట్టుకుని కాల్చిచంపారు. 1924 జూన్ నాటికి రంప విప్లవం సమసిపోయింది. అల్లూరి సీతారామరాజు చేసిన మన్యం విప్లవాన్ని, ఆయన దేశభక్తిని, త్యాగాన్ని గాంధీజీ ఆ తర్వాతకాలంలో 1929 జూలై 18న యంగ్ ఇండియా పత్రికలో అభివర్ణించాడు.


 RELATED TOPICS   

ఆంధ్రదేశంలో జాతీయోద్యమం

ఆంధ్రదేశంలో వందేమాతర ఉద్యమం

ఆంధ్రదేశంలో హోంరూల్ ఉద్యమం 

ఆంధ్రదేశంలో సహాయ నిరాకరణోద్యమం -1

ఆంధ్రదేశంలో క్విట్ ఇండియా ఉద్యమం