ఆధునిక పారిశ్రామిక వ్యవస్థలలో రసాయన సంబంధ విపత్తులు (Chimical Disasters) అత్యంత ప్రధానమైనవి. ప్రభుత్వం, ప్రైవేట్ రంగాలతో బాటు సమాజం రసాయన విపత్తు నిర్వహణకు సంబంధించి అనేక రకాల ఆందోళనకరమైన స్థితులు ఎదుర్కొనాల్సి వస్తున్నది. రసాయన విపత్తుల ప్రభావంగా మానవులకు అనేకనకమైన బాధాకర పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం కలదు. అంతేకాకుండా వీటి కారణంగా ప్రాణనష్టాలు కూడా సంభవిస్తాయి. ప్రకృతి, ఆస్తిని కూడా ఇవి దెబ్బతీస్తాయి. రసాయన విపత్తు కారణంగా అత్యధికంగా నష్టపోయే అంశాలలో ప్రధానంగా పారిశ్రామిక కర్మాగారం, అందులో పనిచేసే ఉద్యోగులు & కార్మికులు, భారీ రసాయన వాహనాలు, సమీపంలో ఉండే భవనాలు, వాటిలో నివసించే నివాసితులు, సమీపంలోని ఆవాసాలలోని నివాసితులు, చుట్టుపక్కల కమ్యూనిటీ ఉన్నాయి.

రసాయన విపత్తులు(Chimical Disasters) అనేక విధాలుగా సంభవించవచ్చు అవి:

భద్రతా వ్యవస్థల వైఫల్యాలు

మానవ తప్పిదాలు

సాంకేతిక లోపాలు

నిర్వహణ లోపాలు

ప్రకృతి వైపరీత్యాల ప్రేరేపిత ప్రభావం

రవాణా సమయంలో ప్రమాదాలు

ప్రమాదకర వ్యర్ధాల ప్రాసెసింగ్/పారవేయడం

తీవ్రవాద దాడి/ విధ్వంసానికి దారితీసే అశాంతి

భారతదేశంలో రసాయన విపత్తులు

1984లో ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన రసాయన (పారిశ్రామిక) విపత్తు “భోపాల్ గ్యాస్ విషాదం”ని భారతదేశం చవిచూడాల్సి వచ్చింది. భోపాల్ గ్యాస్ విషాదం దేశ చరిత్రలో అత్యంత వినాశకరమైన రసాయన ప్రమాదంగా పరిగణించబడుతున్నది. ఇక్కడి యూనియన్ కార్బైడ్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు మిథైల్ ఐసో సైనేట్ అనే విష వాయువు విడుదలైన కారణంగా వేలాది మంది ప్రాణాలో కోల్పోయారు.

ఇటువంటి ప్రమాదాలకు సంబంధించిన సంఘటనలు, ప్రాణనష్టం, ఆస్తినష్టం, పర్యావరణ నష్టం మొదలైనవి. ముఖ్యమైనవి. భోపాల్ గ్యాస్ విషాదంలో దుర్బలత్వం ప్రదర్శితమైన తర్వాత కూడా భారతదేశం అనేక రసాయన ప్రమాదాల పరంపరను చవి చూసింది. గడచిన దశాబ్దంలో భారతదేశంలో సుమారు 130కి పైగా ముఖ్యమైన రసాయన ప్రమాదాలు నమోదయ్యాయి. దీని ఫలితంగా 259 మంది మరణించడం మరియు 563 మందికి భారీ గాయాలవడం జరిగింది..

దేశంలోని అన్ని జోన్లలో 301 జిల్లాలు మరియు 25 రాష్ట్రాలు & 3 కేంద్రపాలిత ప్రాంతాలలో విస్తరించి ఉన్న దాదాపు 1861 భారీ యాక్సిడెంట్ సంభావ్యత (Major Accident Hazard-MAH) కలిగిన యూనిట్లు కలవు. అంతేకాకుండా, వేలాది నమోదిత మరియు ప్రమాదకర కర్మాగారాలు (MAH ప్రమాణాల క్రింద), అసంఘటిత రంగాలు అనేక రకాల ప్రమాదకర పదార్థాలతో వ్యవహరించే తీవ్రమైన, సంక్లిష్ట స్థాయి విపత్తు ప్రమాదాలను కలిగి ఉన్నాయి. రసాయన ప్రమాదాలను నివారించడానికి భారతదేశంలో అమలులో ఉన్న చట్టాలు

రసాయన ప్రమాదాలు సంభవించినపుడు చేపట్టవలసిన చర్యలకు గాను మన దేశంలో సమగ్ర చట్టపరమైన/ సంస్థాగత ఫ్రేమ్వర్క్ రూపొందించడం జరిగింది. రవాణా, బాధ్యత, బీమా, పరిహారాలలో భద్రతను కల్పించే అనేక నిబంధనలు రూపొందించబడ్డాయి.

దేశంలో అమలులో ఉన్న రసాయన విపత్తు నిర్వహణపై సంబంధిత నిబంధనలు

  • పేలుడు పదార్థాల చట్టం 1884
  • పెట్రోలియం చట్టం 1934
  • ఫ్యాక్టరీల చట్టం 1948
  • పురుగుమందుల చట్టం 1968
  • పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 
  • మోటారు వాహనాల చట్టం 1988 
  • పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ 1991 
  • డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005